శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన ముంబై సౌత్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన వర్లీ నుంచి పోటీ చేయనున్నారు. తన తండ్రి ఉద్దవ్ ఠాక్రే మరియు ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో వర్లీ నియోజకవర్గం నుంచి పోటీకి ఈ రోజు ఆదిత్య థాకరే నామినేషన్ దాఖలు చేసారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముందు ముంబయిలో భారీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ పార్టీతో ఒప్పందాల ప్రకారం శివసేన తరపున ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఆదిత్య థాకరే ఉండబోతున్నట్టు మహారాష్ట్రలో రాజకీయ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈనెల 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, 24వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.
ఆదిత్య థాకరే నామినేషన్ సందర్భంగా శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే మాట్లాడుతూ, తమ కుటుంబం మొదటినుంచి సామాజిక సేవ చేస్తుందని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ముందుగా నిర్ణయించుకున్నామని, అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పారు. వర్లీ నియోజక ప్రజలకోసం ఆదిత్య ఎప్పుడూ అండగా ఉంటాడని భావిస్తున్నానని, ముంబై ఓటర్లు ఆదిత్యకు మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నట్లు ఉద్దవ్ థాకరే అన్నారు. అయితే భవిష్యత్తులో ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా ప్రత్యక్ష ఎన్నికల పోటీల్లోకి ప్రవేశించిన మొదటి థాకరే కుటుంబ సభ్యుడుగా ఆదిత్య థాకరే నిలిచారు. అందరూ ఎన్నికల్లో పోటీ చేయమని తనను ప్రోత్సహించినందు వల్ల, ఎన్నికలలో పోటీ చేయడానికి చాలా సంతోషిస్తున్నానని ఆదిత్య థాకరే తెలిపారు.
[subscribe]