ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్ దాడులలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి, ఇటీవలే వీర్ చక్ర అవార్డు గెలుచుకున్న వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మళ్ళీ విధుల్లోకి చేరారు. ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా తో కలిసి మిగ్-21 యుద్ధ విమానాన్ని నడిపాడు. పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరం నుంచి బీఎస్ ధనోవా, అభినందన్ వర్థమాన్ మిగ్-21 విమానాన్ని నడిపినట్టు అధికారులు తెలియజేసారు. కొన్ని నెలల విరామం తరువాత విధుల్లో చేరి యుద్ధ విమానాన్ని నడపబోతున్న అభినందన్ కు తోడుగా, స్థైర్యంగా బీఎస్ ధనోవా వెళ్లడం విశేషం. బాలాకోట్ దాడులు జరిగిన తరువాత ఏర్పడిన పరిస్థితుల అనంతరం అభినందన్ కొన్ని రోజులు ఇంటివద్దనే విశ్రాంతి తీసుకున్నారు. పలు దఫాల వైద్య పరీక్షల నిర్వహించిన తరువాత మిగ్-21 నడపడానికి అభినందన్ కు పూర్తి సామర్థ్యం ఉందని వైద్యులు తేల్చారు.
ఫిబ్రవరి 26, 2019 బాలాకోట్ లో భారత్ పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం, పాకిస్తాన్ విమానాలు భారత్ పై దాడికి ప్రయత్నం చేసాయి. అటువంటి సమయంలో అభినందన్ వర్థమాన్ తన మిగ్ జెట్ విమానంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసాడు, తర్వాత మిగ్ విమానం కూడ కూలిపోవడంతో అభినందన్ వర్థమాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో దిగాడు. అక్కడి స్థానికులు పట్టుకుని పాకిస్తాన్ సైన్యానికి అప్పగించారు, అంతర్జాతీయ దేశాల నుండి పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరగడంతో మూడు రోజుల తరువాత పాకిస్తాన్ అధికారికంగా సరిహద్దు వద్ద భారత్ కు అప్పగించింది. ఎటువంటి సైనిక రహస్యాలు వెల్లడించకుండా చూపిన తెగువకు అభినందన్ ను దేశ ప్రజలు ఎంతో మెచ్చుకున్నారు. అభినందన్ సాహసాలకు గుర్తింపుగా జవాన్లకు పరమ వీర చక్ర, మహా వీరచక్ర తరువాత ఇచ్చే మూడో అత్యున్నత వీర్ చక్ర పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
[subscribe]
[youtube_video videoid=QbG4ldWIYfc]