ఉన్నావ్ అత్యాచార ఘటనలో బాధితురాలు డిసెంబర్ 6, శుక్రవారం రాత్రి మృతి చెందింది. 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ రాత్రి 11.40 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఆమెపై గత డిసెంబరులో దుండగులు అత్యాచారం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శుభం త్రివేదిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు నవంబర్ 30న అరెస్టు చేసినప్పటికీ, అనంతరం అతన్ని బెయిల్పై విడుదల చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక శుభం త్రివేది బాధితురాలిని అనుసరించి బెదిరించగా, బాధితురాలు మరియు ఆమె కుటుంబం పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణలో భాగంగా డిసెంబర్ 5, గురువారం నాడు రాయ్బరేలీలోని న్యాయస్థానానికి హాజరయ్యేందుకు బయలుదేరిన ఆమెను ప్రధాన నిందితులైన శివం త్రివేది, శుభం త్రివేదిలతోపాటు రామ్కిశోర్ త్రివేది, ఉమేశ్ బాజ్పాయి, హరిశంకర్ త్రివేదిలు దారిలో అడ్డుకుని, ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. బాధితురాలు కాలిన గాయాలతోనే కేకలు వేసుకుంటూ కిలోమీటరు వరకు పరుగులు పెట్టింది. సమీప వ్యక్తుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ముందుగా ఆమెను లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. రెండు రోజులపాటు చికిత్స పొందిన ఆమె శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై విచారణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేసింది. ఐదుగురు సభ్యులతో దీన్ని ఏర్పాటు చేశారు, ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయిస్తామని అధికారులు తెలిపారు.
[subscribe]