పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం లభించడంతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా అస్సాం, త్రిపురల్లో నిరసనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలను అడ్డుకునేందుకు అస్సాం ప్రభుత్వం గువాహటిలో కర్ఫ్యూ విధించింది. తిరిగి నగరంలో సాధారణ స్థితిని పునరుద్ధరించే వరకు కర్ఫ్యూ విధించబడుతుందని గువాహటి పోలీసు కమిషనర్ దీపక్ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సమాచార వ్యవస్థను సైతం 24 గంటపాటు నిలిపివేసింది. పలు విద్యాసంస్థలు నుంచి వేలాది మంది నిరసనకారులు, ప్రజలు రోడ్లపైకి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వాహనాలను తగలబెట్టడం, దుకాణాలను ధ్వంసం చేయడం మరియు పోలీసులుపై రాళ్ళు రువ్వడం వంటి చర్యలతో నిరసనకారులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ బిల్లును నిరసిస్తూ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ గురువారం గువాహటిలో బహిరంగ సభకు పిలుపునిచ్చింది. దీంతో ఆర్మీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. అలాగే దిబ్రుగఢ్, జోర్హాట్ మరియు ఇతర ప్రదేశాలలో చాలా మంది నిరసనకారులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనావాల్ గువాహటి విమానాశ్రయంలో చాలా గంటలు చిక్కుకున్నారు. సోనావాల్, రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ అస్సామీలు అయినప్పటికీ రాష్ట్రంలోని ప్రజల మనోభావాలను ఎందుకు అర్థం చేసుకోలేకపోయారని నిరసనకారులు ప్రశ్నించారు. మరోవైపు త్రిపురలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో జరుగుతున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఈ బిల్లు అమలు గురించి ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, మీ హక్కులను ఎవరూ హరించలేరంటూ ట్విట్టర్ వేదికగా అస్సాం ప్రజలకు హామీ ఇచ్చారు. ‘అస్సాంలోని నా సోదరులు మరియు సోదరీమణులుకు పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. మీ హక్కులు, ప్రత్యేకమైన గుర్తింపు, అందమైన సంస్కృతిని ఎవరూ హరించలేరు. ఇది వృద్ధి చెందుతూనే ఉంటుంది. అస్సామీ ప్రజల రాజకీయ, భాషా, సాంస్కృతిక మరియు భూ హక్కులను రాజ్యాంగబద్ధంగా పరిరక్షించడానికి క్లాజ్ 6 యొక్క స్ఫూర్తి ప్రకారం కేంద్ర ప్రభుత్వం మరియు నేను పూర్తిగా కట్టుబడి ఉన్నామని’ ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.
[subscribe]