అయోధ్యలోని ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ స్థల వివాదం కేసులో, 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకే అప్పగించాలని నవంబర్ 9న సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ జామియత్ ఉలేమా ఎ హింద్ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అషద్ రషీది డిసెంబర్ 2, సోమవారం నాడు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. సయ్యద్ రషీది ఈ కేసులో తొలి పిటిషన్దారుడైన ఎం సిద్ధిఖీకి చట్టబద్ధ వారసుడు. ఈ సంస్థతో పాటు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) కూడా డిసెంబర్ 9 లోపు రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశమున్నట్టు తెలుస్తుంది. సున్నీ వక్ఫ్ బోర్డు ఇప్పటీకే రివ్యూ పిటిషన్ దాఖలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. అయితే ఐదు ఎకరాల స్థలాన్ని అంగీకరించాలా వద్దా అనే అంశంపై ఇంకా స్పందించలేదు.
మరో వైపు అయోధ్య భూవివాదం కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు సహా ఇతర ముస్లిం పక్షాల తరఫున వాదిస్తున్న ప్రముఖ సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ ను ఈ కేసు నుంచి తప్పించారు. ఈ విషయాన్ని రాజీవ్ ధావన్ స్వయంగా వెల్లడించారు. ‘అయోధ్య కేసు నుంచి ఏఓఆర్ ఇజాజ్ మక్బూల్ నన్ను తొలగించారు. ఆ నిర్ణయాన్ని నేను ఎలాంటి అభ్యంతరం లేకుండా అంగీకరిస్తున్నా. ఇకపై అయోధ్య రివ్యూ లేదా కేసు వ్యవహారంలో నేను జోక్యం చేసుకోను. అనారోగ్యం కారణంగా నన్ను ఈ కేసు నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. ఇది పూర్తిగా అర్థరహితమని’ రాజీవ్ ధావన్ పేర్కొన్నారు. రాజీవ్ తొలగింపుపై ఏఓఆర్ ఇజాజ్ మక్బూల్ స్పందిస్తూ, అనారోగ్యం కారణంగా ఆయన్ను అయోధ్య రివ్యూ కేసు నుంచి తొలగించామని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. సోమవారం నాడు ఆయన అందుబాటులో లేకపోవడంతోనే పిటిషన్లో ఆయన పేరును చేర్చలేకపోయానని, ఇందులో వివాదమేమీ లేదని ఇజాజ్ మక్బూల్ వెల్లడించారు.
[subscribe]