ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకరణను వ్యతిరేకిస్తూ, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు అధికారుల సంఘాలు రెండు రోజుల పాటు బ్యాంకు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 26, 27 తేదీల్లో తలపెట్టిన బ్యాంకుల సమ్మెను విరమించుకుంటున్నట్టు బ్యాంకు అధికారుల సంఘాలు ప్రకటించాయి. ఈ సమ్మె విషయంపై కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో 26 ,27 తేదీల్లో యధావిధిగా బ్యాంకుల కార్యకలాపాలు జరగనున్నాయి.
నాలుగు బ్యాంకులకు చెందిన అధికార సంఘాల నాయకులతో రాజీవ్ కుమార్ సెప్టెంబర్ 23, సోమవారం నాడు భేటీ అయ్యారు. బ్యాంకుల విలీనం, బ్యాంకుల్లో సంస్కరణలు, వేతన సవరణ, ఐదు రోజుల పని దినాలు, నగదు లావాదేవీలు లాంటి అనేక అంశాలపై వారి మధ్య చర్చలు జరిగాయి. బ్యాంకుల విలీనంతో ఇప్పటికే ఉన్న పని వత్తిడి తో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులపై మరింతగా భారం పడుతుందని, కొందరి బ్యాంకు ఉద్యోగులు అభద్రతకు గురవుతున్న విషయాలపై కూడ చర్చలు సాగించారు. సంఘాల నాయకులు ప్రస్తావించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపిన తరువాత రాజీవ్ కుమార్ సానుకూలంగా స్పందించి, వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బ్యాంకు అధికారుల సంఘాలు సమ్మెను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు.
[subscribe]