వరుసగా రెండోసారి అధికారం చేజిక్కున్న బీజేపీ పార్టీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను అందుకున్న విరాళాలను నవంబర్ 11, సోమవారం నాడు వెల్లడించింది. చెక్కులు, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా వివిధ సంస్థలు, ట్రస్టుల నుంచి 700 కోట్ల రూపాయల పైగా విరాళాలను అందుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీజేపీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో తెలిపింది. అయితే బీజేపీ ప్రకటించిన ఈ విరాళాల్లో దాదాపు సగం మొత్తాన్ని టాటాసన్స్ నేతృత్వంలో నడిచే ‘ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్టు’ నుంచే రావడం విశేషం. ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ.356 కోట్లు విరాళం అందగా, దేశంలోని మరో ధనిక ట్రస్టు అయిన ‘ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు’ నుంచి రూ.54.25 కోట్ల విరాళాలు బీజేపీ పార్టీకి అందాయి.
ఈ ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టుకు భారతి గ్రూప్, హీరో మోటోకార్ప్, జూబిలెంట్ ఫుడ్వర్క్స్, ఓరియంట్ సిమెంట్, డిఎల్ఎఫ్, జెకె టైర్స్ మరియు అనేక ఇతర కార్పొరేట్ సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందుకున్న విరాళాల వివరాలను ప్రకటించిన మొత్తంలో చేర్చలేదు. అదే విధంగా రూ.20,000 మరియు అంతకంటే ఎక్కువుగా వచ్చిన చెక్ లేదా ఆన్లైన్ చెల్లింపుల విరాళాలనే సమర్పించినట్టుగా తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం, దేశంలోని రాజకీయ పార్టీలు ప్రతి ఆర్థిక సంవత్సరానికి గాను తమకు లభించే అన్ని విరాళాలను తప్పనిసరిగా వెల్లడించడించే విధానాన్ని తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం రాజకీయ పార్టీలు రూ.20,000 కన్నా తక్కువ ఇచ్చే వ్యక్తులు మరియు సంస్థల యొక్క పేర్లను లేదా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళం ఇచ్చే వారి పేర్లను ప్రకటించాల్సిన అవసరం లేదు.
[subscribe]