మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ తో రాజకీయ కోలాహలం నెలకుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వరుసగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో అధికార బీజేపీ పార్టీ తమ పార్టీ నుంచి బరిలోకి దిగే అభ్యర్థులపై భారీ కసరత్తు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 125 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను అక్టోబర్ 1, మంగళవారం నాడు బీజేపీ పార్టీ విడుదల చేసింది. ఎన్నికలు ఈ నెల 21న జరగనున్న నేపథ్యంలో విజయం కోసం ప్రణాళికలు రూపొందించి, బీజేపీ ప్రచారానికి సిద్ధమవుతుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ సౌత్ నియోజక వర్గం నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు.
అదే విధంగా మంత్రి చంద్రకాంత్ పాటిల్ కొత్రుడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, శివాజీ మహారాజ్ కుటుంబీకుడైన శివేంద్ర సింగ్ సతారా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. బీజేపీ పార్టీ ప్రకటించిన తొలిజాబితాలో 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు. 91 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరిగి చోటు దక్కించుకున్నారు. తొలిజాబితాలో ఇటీవలే కాంగ్రెస్లో చేరిన ఐదుగురికి, ఎన్సీపీ నుంచి వచ్చిన నలుగురికి, మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించారు. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, బీజేపీ మిత్రపక్షమైన శివసేన పార్టీతో కలిసి పోటీచేస్తుంది. మరో వైపు శివసేన పార్టీ సైతం 124 మంది అభ్యర్థులతో తోలి జాబితాను ప్రకటించింది. ఈ నెల 21న ఒకే దశలో ఎన్నికలు జరిగి, 24వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.
[subscribe]