కేఫ్ కాఫీ డే (సిసిడి) వ్యవస్థాపకుడు వి.జి.సిద్ధార్థ అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది, జూలై 29 న నేత్రావతి నది వంతెన కింద కారు దిగి సిద్ధార్థ కనిపించకుండా పోయారు, ఒక వ్యక్తి నదిలో దూకాడని స్థానిక జాలరి చెప్పడంతో, వంతెనపై నుండి నదిలోకి దూకి ఉంటారన్న అనుమానాలతో, నదిలో రెండు రోజుల నుండి తీవ్రంగా గాలిస్తుండగా ఈ రోజు ఉదయం సిద్ధార్థ మృతదేహం లభ్యమైంది. ఎంతో సాధించాలని కేఫ్ కాఫీ డే స్థాపించిన, వ్యాపారంలో విజయవంతం కాలేకపోయానని, ఐటీ, ప్రయివేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ వేధిస్తున్నారంటూ సిద్ధార్థ రాసిన లేఖ సంచలనం సృష్టించింది.
వి.జి.సిద్ధార్థ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు మంగుళూరుకు చేరుకున్నారు. మంగుళూరు వెన్ లాక్ ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించిన అనంతరం పార్దీవ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలను సిద్ధార్థ తండ్రి ఎస్టేట్ లో నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఫౌండర్ మృతికి సంతాపంగా యాజమాన్యం సెలవు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా కేఫ్ కాఫీ డే షాపులు మూతబడ్డాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వి.జి.సిద్ధార్థ మృతి పట్ల విచారం వ్యక్తం చేసారు, ఎస్.ఎం కృష్ణ కుటుంబ సభ్యులు, మరియు సిద్ధార్థ మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. మరో వైపు సిద్ధార్థ మృతిపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ కోరారు.
[subscribe]
[youtube_video videoid=6zTQB6koTZU]