అయోధ్య ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ భూవివాదం కేసులో మరి కొద్దీ రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య తీర్పు సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీర్పు తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. కోట్లాది మంది దేశ ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు నవంబర్ 7, గురువారం నాడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే తీర్పుపై ఎటువంటి అనవసర ప్రకటనలు కానీ వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించిన సంగతి తెలిసిందే.
మరోవైపు అయోధ్య భూవివాదంపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఉత్తరప్రదేశ్ సీఎస్ రాజేంద్ర కుమార్తివారీ, డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్లతో భేటీ అయ్యారు. వారిని తన ఛాంబర్ కు పిలిచి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతలపై వారితో చర్చించారు. దేశంలో పలు విషయాల్లో ప్రభావం చూపించే చారిత్రక తీర్పు నేపథ్యంలో అధికారులు ముందస్తుగా తీసుకుంటున్న చర్యలను ఆయన సమీక్షించారు. ఇప్పటీకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో భారీగా భద్రత చర్యలు చేపట్టింది. 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అయోధ్యకు 4వేల మంది పారామిలిటరీ దళాలను తరలించినట్లు సమాచారం. అదేవిధంగా అయోధ్యలో అక్టోబర్ 13 నుంచే సెక్షన్ 144ని విధించారు. డిసెంబర్ 10 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా మేజిస్ట్రేట్ తెలియజేశారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచడానికి 16 వేల మంది వాలంటీర్లను నియమిస్తున్నారు. సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నవంబర్ 17వ తేదీన పదవి విరమణ చేయబోతుండంతో ఆ లోపే తుది తీర్పు వెలువడవచ్చని భావిస్తున్నారు.
[subscribe]