కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 14, శనివారం నాడు ‘భారత్ బచావో’ ర్యాలీ చేపట్టింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ కేంద్రమంత్రి చిదంబరం, ఇతర కాంగ్రెస్ అగ్రనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో సోనియాగాంధీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, దేశాన్ని కాపాడుకునేందుకు కలిసి పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. దేశ ఆర్ధిక వ్యవస్థను విచ్చిన్నం చేసారని, యువతకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేక దేశాన్ని అంధకారంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతుంటే మోదీ-అమిత్ షాలకు ఏ మాత్రం పట్టింపు లేదని ధ్వజమెత్తారు. రాజ్యాంగంలో ఆర్టికల్స్ ను ఇష్టానుసారంగా మారుస్తూ, రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే భారత్ బచావో కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ ఒంటిచేత్తో నాశనం చేసారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఉల్లి ధర కిలో రూ.200కు చేరిందని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు జీడీపీ 4 శాతానికి పడిపోయిందని, జీడీపీ గణాంకాలను లెక్కించే విధానాన్ని అధికార బీజేపీ పార్టీ మార్చేశాకే ఇంత ఉంటే, పాత పద్ధతిలో గనుక లెక్కిస్తే జీడీపీ వాస్తవానికి 2 శాతమే ఉండేదని ఆరోపించారు. దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ మరోసారి సమర్థించుకున్నారు. ఈ విషయంపై క్షమాపణలు చెప్పమని అడుగుతున్నారని, అయితే తాను నిజమే మాట్లాడానని, ప్రాణం పోయినా క్షమాపణలు చెప్పనని అన్నారు. తన పేరు రాహుల్ సావర్కర్ కాదని, రాహుల్ గాంధీ అంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, మోదీ ఉంటే అన్నీ సాధ్యమే అనే నినాదాన్ని బీజేపీ ప్రభుత్వం పలు వైఫల్యాలతో నిజం చేస్తుందని విమర్శించారు. దేశం పలు రంగాల్లో వెనుకబడిపోతుందని, దేశ పౌరులుగా స్పందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
[subscribe]