మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నవంబర్ 22, శుక్రవారం నాడు ఉత్కంఠ వీడనుంది. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని శరద్ పవార్ ఇంటిలో సమావేశమై కనీస ఉమ్మడి ప్రణాళికపై కీలకంగా చర్చించారు. అనంతరం ఈ రోజు ఉదయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయి మహారాష్ట్రలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. శివసేనతో పొత్తుపెట్టుకొని మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేసే అంశంపై సోనియా గాంధీ ఇప్పటికే అంగీకారం చెప్పినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ రోజు ఎన్సీపీ నాయకులతో మరో దఫా చర్చలు జరిపాక, శుక్రవారం నాడు తుది నిర్ణయం వెలువరిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠాన్ని ముందుగా శివసేన, ఆ తరువాత ఎన్సీపీ చెరో రెండున్నరేళ్లు పదవీకాలాన్ని పంచుకునేందుకు సూత్రపాయంగా ఒప్పందం కుదిరినట్టుగా ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీకి ఐదు సంవత్సరాల పాటు డిప్యూటీ సీఎం, స్పీకర్ తో పాటు కొన్ని కీలక మంత్రి పదవులు ఇచ్చేందుకు ఇరు పార్టీలు ఒప్పుకునట్టుగా సమాచారం. శుక్రవారం నాడు కాంగ్రెస్ – ఎన్సీపీ నేతలు శివసేన నాయకులతో భేటీ అయ్యి తదుపరి అంశాలపై చర్చించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు శివసేనతో కాంగ్రెస్ కలవడాన్ని ఆ పార్టీ నేత సంజయ్ నిరుపమ్ వ్యతిరేకిస్తున్నారు. ట్విట్టర్లో ఈ అంశంపై స్పందిస్తూ శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
[subscribe]