మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎవరూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కావాలంటే సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పార్టీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డిమాండ్ పై బీజేపీ నాయకుడు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొదటిసారిగా స్పందించారు. మహారాష్ట్రలో అతి త్వరలోనే బీజేపీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎం పదవీకాలం చెరిసగం అని చెప్పే 50:50 ఫార్ములా అసలు ఎప్పుడూ చర్చకు రాలేదని చెప్పారు. భాజపా-శివసేన పొత్తు నిర్ణయించుకున్న సమయంలో ఎలాంటి హామీలు కానీ, డిమాండ్లు కానీ లేవని చెప్పారు.
శివసేన పార్టీ నాయకులు చెప్తున్నట్లుగా సీఎం పదవిని రెండున్నర సంవత్సరాలు ఇస్తామని బీజేపీ వారికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని ఫడ్నవీస్ పేర్కొన్నారు. అక్టోబర్ 29, బుధవారం నాడు బీజేపీ శాసనసభా పక్ష నేత ఎన్నిక జరుగుతుందని, త్వరలోనే రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతానని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు. మరో వైపు శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, తండ్రి జైల్లో ఉన్న దుష్యంత్ లాంటి వ్యక్తులు ఇక్కడ ఎవరూ లేరని, శివసేన ఎప్పుడూ సత్యం, ధర్మాన్ని అనుసరించే రాజకీయాలు చేస్తుందంటూ పరోక్షంగా హర్యానాలో బీజేపీ-జేజేపీ పొత్తును ఎద్దేవా చేసారు. అక్టోబర్ 30న బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, శివనేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ను కలిసి చర్చించబోతున్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో మహారాష్టలో ఎవరూ ముఖ్యమంత్రి అవుతారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
[subscribe]