అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలతో వరుసగా సెప్టెంబర్ 23, 24 తేదీల్లో సమావేశం కానున్నారు. ముందుగా సెప్టెంబర్ 22 న హ్యూస్టన్లో జరిగే ‘హౌడీ-మోడీ’ కార్యక్రమానికి ట్రంప్, మోడీ హాజరుకానున్నారు. ట్రంప్ తో కలిసి ప్రధాని మోడీ తొలిసారిగా సంయుక్త ర్యాలీలో ప్రసంగించబోతున్నారు. హ్యూస్టన్లోని ఎన్ఆర్జి స్టేడియం వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి అమెరికా వ్యాప్తంగా సుమారు 50వేల మంది ప్రవాస భారతీయులు హాజరు కానున్నారు. అమెరికాలోని కీలకస్థాయి అధికారులు కూడ ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
హౌడీ-మోడీ కార్యక్రమం పూర్తయిన తరువాత న్యూయార్క్ లో సెప్టెంబర్ 23 సోమవారం నాడు ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 23 నుండి సెప్టెంబర్ 27 వరకు జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంతో(యుఎన్జిఎ) పాటుగా ఈ సమావేశం జరగనుందని సీనియర్ అధికారులు తెలియజేసారు. ఈ భేటీ అనంతరం న్యూయార్క్ లో సెప్టెంబర్ 24 మంగళవారం నాడు ట్రంప్, మోడీ సమావేశం జరగనుంది. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత నరేంద్రమోడీ ట్రంప్ తో నాలుగోసారి భేటీ కానున్నారు. ఇరు దేశాలకు సంబంధించి వాణిజ్య, రక్షణ వంటి పలు అంశాలపై చర్చ జరగనున్నట్టు సమాచారం. మోడీ ఈనెల సెప్టెంబర్ 20న అమెరికాకు బయలుదేరి వెళ్లారు, 74 వ యుఎన్జిఎ సమావేశంతో సహా అక్కడ అనేక కార్యక్రమాలకు హాజరవుతారు. యుఎన్జిఎ సెషన్లో సుమారు 75 మంది విదేశీ ప్రతినిధుల బృందాలను కూడా మోడీ కలవనున్నారు. అనంతరం మోడీ సెప్టెంబర్ 28న భారతదేశానికి తిరిగి వస్తారు.
[subscribe]