జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంతో అక్టోబర్ 31, 2019 నుంచి జమ్మూ కశ్మీర్ మరియు లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతమైనప్పటికీ అసెంబ్లీతో కూడివుంటుంది. జమ్మూ కశ్మీర్ లో త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము శుక్రవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి వ్యవహారాలను కేంద్ర ప్రభుత్వం నేరుగా పర్యవేక్షిస్తుందని, వీలైనంత త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఇక్కడి యంత్రాంగం మరియు పౌరులంతా ఎన్నికలకు సహకరించాలని కోరారు.
జమ్ముకశ్మీర్లోని తల్వారా ప్రాంతంలో 14వ బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కర్తవ్య నిర్వహణకు పోలీసులు సిద్ధంగా ఉండాలని, త్వరలో ఇక్కడ జరిగే ఎన్నికలు సజావుగా సాగడంలో ముఖ్య పాత్ర పోషించాలని కోరారు. గతకొంత కాలంగా జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు గిరీశ్ చంద్ర ముర్ము చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంచరించుకుంది.
[subscribe]