హోం మంత్రి అమిత్ షా సోమవారం ఆగస్టు 5న రాజ్యసభతో పాటు లోక్సభలో కూడ జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లును ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 6, మంగళవారం నాడు జమ్మూ కశ్మీర్ విభజన అంశం, ఆర్టికల్-370 రద్దుపై లోక్సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడీవేడిగా చర్చ జరుగుతుంది. చర్చ మధ్యలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ అసలు దేశ అంతర్గత వ్యవహారం కాదని, ఐక్యరాజ్యసమితి మానిటర్ చేస్తున్నపుడు ఏ విధముగా అంతర్గత అంశం అవుతుందని అమిత్ షా ను ప్రశ్నించడంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సైతం తమ పార్టీ నేత వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసారు. అమిత్ షా మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని, ఈ రాష్ట్ర కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే అని చెప్పారు.
నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ హాసనైన్ మసూది మాట్లాడుతూ ఆర్టికల్-370ను అప్పట్లో జన సంఘ్ నేత శ్యాం ప్రసాద్ ముఖర్జీ స్వాగతించారని చెప్పగా, అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఎప్పుడూ ఆర్టికల్-370ను సమర్ధించలేదని, ఆధారాలు ఉంటే చూపాలని కోరారు. మరో వైపు కశ్మీర్ విభజన బిల్లును వ్యతిరేకిస్తూ టీఎంసీ పార్టీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేసారు. లోక్సభలో తెరాస పక్షనేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్ధతు ఇవ్వాలని కోరారు. ఆర్టికల్-370 రద్దు స్వాగతించదగిన విషయమని చెప్పారు, జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుకు తెరాస పార్టీ సంపూర్ణ మద్ధతు తెలుపుతుందని తెలియజేసారు.
[subscribe]
[youtube_video videoid=ZiIs1279bdY]