హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 5 సోమవారం నాడు జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు మరియు రాష్ట్ర పునర్విభజన బిల్లులను లోక్సభలో ప్రవేశ పెట్టారు. కాగా ఆగస్టు 6, మంగళవారం నాడు జమ్మూ కశ్మీర్ విభజన అంశం, ఆర్టికల్-370 రద్దుపై లోక్సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, డీఎంకే సభ్యులు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. సాయంత్రం వరకు జరిగిన చర్చల అనంతరం, సభలో ఓటింగ్ పెట్టారు. ఆర్టికల్-370 రద్దు బిల్లుకు 351 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 72 మంది వ్యతిరేకంగా ఓటు వేసారు. జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుకు 370 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 70 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేసారు.
రాజ్యసభ లో ఆమోదం అనంతరం లోక్సభలో కూడ ఈ బిల్లులు ఆమోదం పొందడంతో బీజేపీ సభ్యులు అనందం వ్యక్తం చేశారు. నరేంద్రమోడీ సంకల్పించుకోకపోతే ఇది సాధ్యంకాదని, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల ప్రజల జీవన విధానాలను మెరుగుపరచడానికి ప్రధాని మోడీ ఎంతో నిబద్ధత చూపించారని హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. ఈ బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం పొందడంలో అమిత్ షా కృషి ఎంతో ఉందని, ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు. చారిత్రాత్మక బిల్లులు ఆమోదం నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని పార్టీలకు, అందరి ఎంపీలకు, ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ బిల్లులకు రెండు సభల్లో ఆమోదం లభించడంతో, తరువాత ఆమోదం కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం బిల్లులు చట్టంగా మరి అమలులోకి వస్తాయి.
[subscribe]
[youtube_video videoid=ug6akNF4WpM]