వైద్యశాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు గాను ఈ ఏడాది ముగ్గురు పరిశోధకులకు నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి పొందిన వారిలో విలియం కైలిన్, గ్రెగ్ సెమెంజా అమెరికాకు చెందినవారు కాగా, పీటర్ రాట్క్లిఫ్ బ్రిటన్ కు చెందిన వారు. శరీరంలో కణాలు ఆక్సిజన్ను ఎలా గుర్తించి, స్వీకరిస్తాయి అనే అంశంపై చేసిన జరిపిన పరిశోధనలకు గానూ వారిని నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లుగా కమిటీ ప్రకటించింది. రక్త హీనత, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులపై పోరాటం చేయడానికి వీరి పరిశోధనలు ఉపయోగపడతాయని తెలిపింది. 2019 సంవత్సరానికి గాను ఈ ముగ్గురికి సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు పేరొన్నారు.
1901 నుంచీ నోబెల్ను వైద్యశాస్త్రంలో సేవలందిస్తున్నవారికి ప్రదానం చేస్తున్నారు. పురస్కారం కింద 6 కోట్ల రూపాయలను గ్రహీతలకు సమానంగా అందజేయనున్నారు. వైద్య శాస్త్రంలో నోబెల్ విజేతలను అక్టోబర్ 7న ప్రకటించగా, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో పరిశోధనలు చేసిన వారికి అక్టోబర్ 8, 9వ తేదీలలో పురస్కారాలను ప్రకటించనున్నారు. డబుల్ హెడర్ సాహిత్య ప్రైజ్ను,శాంతి నోబెల్ బహుమతిని అక్టోబర్ 10, 11 తేదీలలో ప్రకటించనున్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ఇచ్చే ఈ ఘన పురస్కారాలను, ప్రతీ సంవత్సరం ఆయన వర్థంతి (డిసెంబర్ 10) సందర్భంగా ప్రదానం చేస్తారు.
[subscribe]