కర్ణాటకలో జులై నెలలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేశ్కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అనంతరం అనర్హత ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలిపిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 15 నియోజకవర్గాలకు డిసెంబరు 5, గురువారం నాడు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగిలిన రెండు నియోజకవర్గాలకు సంబంధించి కోర్టులో కేసులు ఉండడంతో అక్కడ ఉప ఎన్నికలు జరగడంలేదు. 15 శాసనసభ స్థానాలకు ఈ రోజు మొదలైన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
పోలింగ్ ఉదయం 7 గంటలకు నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. గురువారం ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 165 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వారిలో 9 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఈ ఉపఎన్నికల్లో విడివిడిగా పోటీచేస్తున్నాయి. 225 మంది సభ్యుల ఉన్న కర్ణాటక అసెంబ్లీలో మెజారిటీ పొందడానికి 15 ఉప ఎన్నికల స్థానాల్లో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కనీసం ఆరు స్థానాలను దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నారు.
[subscribe]