కర్ణాటక రాష్ట్రంలో 15 శాసనసభ స్థానాలకు డిసెంబర్ 5న నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు కొనసాగుతుంది. ఈ ఫలితాల్లో అధికార బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోనుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ పది స్థానాలను గెలుచుకుని మరో రెండు స్థానాల్లో ముందంజలో ఉంది. అథాని, ఎల్లాపూర్, కాగ్వాడ్, చిక్ బల్లాపూర్, కృష్ణరాజుపుర, హిరేకేరుర్, రాణెబెన్నూర్, కృష్ణరాజ్పూర్, మహాలక్ష్మి లేఅవుట్ మరియు గోకాక్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. అలాగే విజయనగర, యశ్వంత్పూర్ లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ శివాజీ నగర్, హున్సూర్ నియోజకవర్గాలను దక్కించుకుంది.
ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి పూర్తీ అనుకూలంగా ఉండడంతో కర్ణాటకలో మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వానికి ఇకపై అడ్డంకులు తొలిగిపోనున్నాయి. బీజేపీ గెలుపుతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు సంభరాలు చేసుకుంటున్నారు. మరోవైపు పూర్తి స్థాయి ఫలితాలు ప్రకటించకముందే 15 నియోజకవర్గాల్లో ప్రజల తీర్పును స్వీకరిస్తున్నామని, ఓటమిని అంగీకరిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్ ఈ ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాభవాన్ని చవిచూసింది. 15 నియోజకవర్గాల్లో ఒక్క స్థానంలోనూ కూడా జేడీఎస్ ఆధిక్యంలో లేదు.
[subscribe]