- ముంబయి నుంచి వచ్చి మళ్ళీ రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలు
- స్పీకర్ ఒక్కొక్కరిని విచారించే అవకాశం
- విధాన సభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నీలదీస్తామంటున్న బిజెపి ఎమ్మెల్యేలు
కర్ణాటక రాజకీయ సంక్షోభంలో ఇంకా మలుపులు కొనసాగుతూనే ఉన్నాయి, నేటినుండి విధానసభ సమావేశాలు మొదలవుతుండడంతో మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. గురువారం అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అందరిని సాయంత్రం లోపు స్పీకర్ ముందు హాజరవ్వాలని, ప్రభుత్వం మరియు స్పీకర్ వెంటనే ఈ విషయం పై స్పష్టత ఇవ్వాలని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముంబయిలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు హుటాహుటినా సాయంత్రం కల్లా బెంగుళూరు చేరుకున్నారు, స్పీకర్ రమేష్ కుమార్ కి వ్యక్తిగతంగా రాజీనామా లేఖలు సమర్పించారు, రాజీనామా పత్రాలు పరిశీలించిన స్పీకర్ వెంటనే ఆమోదించలేనని, తనకు తగిన సమయం కావాలని ప్రకటించారు. స్పీకర్ని కలిసిన అనంతరం, అసమ్మతి ఎమ్మెల్యేలు తిరిగి ముంబయి వెళ్లిపోయారు.
రాజీనామాలపై సుప్రీం కోర్టు ఆదేశాలను గౌరవిస్తానని స్పీకర్ ప్రకటించారు, అసమ్మతి నేతల రాజీనామాలను వెంటనే, త్వరితగతిన ఆమోదించాలనే నిబంధన ఏమి లేదని చెప్పారు. శుక్రవారం నాడు ముగ్గురు ఎమ్మెల్యేలను కలవాలని పిలిచే అవకాశం ఉంది, వారికీ విచారణ కొరకు సాయంత్రం 4 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు రాజీనామా చేసే అవసరం తనకు లేదని, ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం నిర్వహించి, ఇవాళ్టి నుండి మొదలవుతున్న విధానసభ లో అనుసరించాల్సిన విధానాలు పాటు, కీలక నిర్ణయాలపై చర్చించారు. కర్ణాటక బిజెపి నాయకులు, స్పీకర్ తీరుపై అసంతృప్తి వ్యకం చేస్తున్నారు, విధాన సభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నారు.