కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ జూలై 28న, 14మంది తిరుగుబాటు శాసనసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం 2023 ముగిసే వరకు వీరిఫై అనర్హత వేటు వేసి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రజాప్రతినిధుల హక్కులను 14 మంది ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేసారంటూ అనర్హులుగా ప్రకటించారు. స్పీకర్ నిర్ణయం ప్రకారం, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కర్ణాటక 15 వ అసెంబ్లీ పదవీకాలం ముగిసే వరకు ఈ ఎమ్మెల్యేలు ఏ ఎన్నికలలోనూ పోటీ చేయలేరు. ఈ 14 మంది ఎమ్మెల్యేలతో పాటు, స్పీకర్ జూలై 26న జెడిఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు.
స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయంతో బి.ఎస్.యడియూరప్ప శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి జూలై 29 న విశ్వాస పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన తరువాత, బిజెపికి విశ్వాస పరీక్ష గెలవడం చాలా సులభంగా మారింది, 17 మందిపై అనర్హత వేటుతో కర్ణాటక శాసనసభలో ప్రస్తుత శాసన సభ్యుల సంఖ్య 207కు చేరుకుంది, సభలో మెజారిటీని నిరూపించుకోవడానికి బిజెపికి 104 మంది సభ్యుల మద్దతు అవసరమవ్వగా, బిజెపికి అనుకూలంగా మొత్తం 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు, కాంగ్రెస్, జెడిఎస్ ల కూటమిలో 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాస పరీక్షకు ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో బి.ఎస్.యడియూరప్ప సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు.
[subscribe]
[youtube_video videoid=xXndSexp1V0]