పౌరసత్వ సవరణ బిల్లు డిసెంబర్ 9, సోమవారం నాడు లోక్సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై లోక్సభలో సుదీర్ఘంగా 7 గంటల పాటు చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీ నేతల ప్రశ్నలకు సమాధానమిస్తూ హోంమంత్రి అమిత్ షా ఈ అంశంపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరిగిన అనంతరం, నిరసనల మధ్యనే స్పీకర్ ఓం బిర్లా పౌరసత్వ సవరణ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. ఒక్కో అంశం వారీగా ఓటింగ్ నిర్వహించారు, ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన సవరణలన్నింటినీ సభ మూజువాణి ఓటుతో తోసిపుచడంతో వీగిపోయాయి. ఈ బిల్లుకు ఓటింగ్లో అనుకూలంగా 311 మంది, వ్యతిరేకంగా 80మంది ఓటేశారు. ఈ బిల్లు ఆమోదం ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన దాడులు, హింస కారణంగా ఇబ్బందులు ఎదుర్కోని భారతదేశానికి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన్, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించనున్నారు.
ఈ పౌరసత్వ సవరణ బిల్లుకు ఎన్డీయే బాగస్వామ్యపక్షాలైన జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలుతో పాటుగా కూటమిలో లేని వైసీపీ, టీడీపీ, అకాలీదళ్, బిజూ జనతాదళ్, శివసేన వంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి. అలాగే ఈ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, ఆర్ఎస్పీ, ఎంఐఎం, టిఆర్ఎస్ సహా పలు ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, మతప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం సరైన విధానం కాదని, ఈ బిల్లును వ్యతిరేకించే వారందరిని హిందూ వ్యతిరేకులుగా ఈ ప్రభుత్వం ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి విమర్శించారు. అలాగే ఈ బిల్లుకు వ్యతిరేకంగా శశిథరూర్, సౌగత రాయ్, ఎన్కే ప్రేమ్చంద్రన్, గౌరవ్ గొగొయి, అసదుద్దీన్ ఒవైసీ తమ వాదనలు గట్టిగా వినిపించారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం ముగించిన అనంతరం ఈ బిల్లు ప్రతిని చింపేశారు. అయితే కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీల వాదనలని తిప్పికొడుతూ, బిల్లు ఆమోదం పొందడంలో హోం మంత్రి అమిత్ షా కీలక పాత్ర పోషించారు.
[subscribe]