మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన నేతృత్వంలోని కూటమి పూర్తి స్థాయిలో సిద్ధమవుతుండగా, అక్కడి రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నవంబర్ 23, శనివారం ఉదయం మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. అలాగే ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ప్రమాణం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు. శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శుక్రవారం రాత్రి ప్రకటించగా, వారి అంచనాలను ఒక్కసారిగా మారుస్తూ ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ సహాయంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ట్విట్టర్ వేదికగా ఈ పరిణామాలపై స్పందిస్తూ, మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమని, అది పార్టీ నిర్ణయం కాదని చెప్పారు. అజిత్ పవార్ చర్యను తాము సమర్థించడం లేదని అన్నారు. శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఈ ప్రభుత్వ ఏర్పాటుల్లో శరద్ పవార్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అజిత్ పవార్ మరియు ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు ఛత్రపతి శివాజీ సిద్ధాంతాల్ని అవమానించారని వ్యాఖ్యానించారు. శరద్ పవార్, ఉద్దవ్ థాకరే టచ్లోనే ఉన్నారని, వారిద్దరూ కలిసే మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు. ముందుగా మహారాష్ట్రలో విధించిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం శనివారం తెల్లవారుజామున ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మహారాష్ట్రలో జరుగుతున్న వరుస పరిణామాలన్నీ దేశంలోని ఇతర ముఖ్య రాజకీయ నాయకుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
.
[subscribe]