మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు(అక్టోబర్ 21) పోలింగ్ కొనసాగుతుంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అవ్వగా, ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఎన్సీపీ అధినేత శరత్ పవార్, శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే వారి కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. అదేవిధంగా అమీర్ ఖాన్, ఎంపీ రవి కిషన్, రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా, మాధురీ దీక్షిత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు.
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తోలి గంటల్లో కొంచెం నెమ్మదిగా కొనసాగింది. ఉదయం 9 గంటల వరకు మహారాష్ట్రలో 5.46 శాతం, హర్యానాలో 8.37 పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరో వైపు ఈ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 64 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 24న వెలువడనున్నాయి. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి, ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.
[subscribe]