భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ చివరి క్షణంలో భూమితో సిగ్నల్స్ కోల్పోయి చంద్రుని దక్షిణ ధ్రువంలో పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభించింది. విక్రమ్ ల్యాండర్ జాడను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయినా నాసా కనిపెట్టింది. అందుకు సంబంధించిన ఫోటోలను నాసా తన అధికారిక ట్విట్టర్లో ఖాతాలో షేర్ చేసింది. నాసాకు చెందిన లూనార్ రీకనైసాన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్వో) తీసిన ఫొటోల్లో విక్రమ్ ల్యాండర్ కనిపించింది. విక్రమ్ ల్యాండర్ శకలాల వల్ల చంద్రుడి ఉపరితలంపై ప్రభావితమైన ప్రదేశాలను ఎల్ఆర్వో స్పష్టంగా గుర్తించింది. విక్రమ్ శకలాలు కొన్ని కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నాయని, ఆ ప్రదేశాలను గుర్తించినట్లు పేర్కొన్నారు.
చెన్నైకి చెందిన షణ్ముగ సుబ్రహ్మణియన్ అనే వ్యక్తి విక్రమ్ ల్యాండర్ కు సంబంధించిన తొలి శకలాన్ని కనిపెట్టినట్లుగా నాసా ప్రకటించింది. ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవాన్ని తాకిన ప్రదేశానికి వాయువ్య ప్రాంతంలో 750 మీటర్ల దూరంలో షణ్ముగ సుబ్రహ్మణియన్ మొదటగా శకలాన్ని గుర్తించాడు. ఆ తరువాత ఎల్ఆర్వో ప్రాజెక్టు బృందం మిగిలిన శకలాలను సైతం గుర్తించినట్లు నాసా పేర్కొంది. అక్టోబర్ 14, 15 మరియు నవంబర్ 11వ తేదీలలో ఈ ఫోటోలు తీసి విక్రమ్ ఆచూకీని ధ్రువీకరించినట్లు నాసా వెల్లడించింది. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడిపై ల్యాండింగ్ అయ్యే సమయంలో సాఫ్ట్ వేర్ సమస్యతో విక్రమ్ ల్యాండర్ భూమి నుంచి సిగ్నల్స్ కోల్పోయి అదుపు తప్పి కూలిపోయింది. అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్ తో సంబంధాల ఏర్పాటు కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ ఆచూకీ లభించలేదు. తాజాగా నాసాకు చెందిన ఎల్ఆర్వో పరిశోధనతో విక్రమ్ ల్యాండర్ కూలిపోయిన ప్రాంతాన్ని గుర్తించారు.