ఆర్థిక మందగమనంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కార్పొరేట్ కంపెనీలకు పన్ను మినహాయింపులను ప్రకటించారు. నిర్మలా సీతారామన్ ఆర్డినెన్స్ ద్వారా దేశీయ కంపెనీలకు మరియు కొత్త దేశీయ తయారీ సంస్థలకు కార్పొరేట్ పన్నును తగ్గించాలని ప్రతిపాదించారు. దేశీయ కంపెనీల కార్పొరేట్ టాక్స్ ను 30 నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దేశీయ కంపెనీలకు అన్ని సెస్ మరియు సర్చార్జీలతో కలిపి కార్పొరేట్ పన్నును ప్రభుత్వం 25.17 శాతానికి తగ్గించింది. అయితే ఈ కంపెనీలకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఉండవని షరతు విధించారు. కొత్త పన్ను రేట్లు,ఊరట చర్యలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే వర్తిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త దేశీయ తయారీ సంస్థలు ఎటువంటి ప్రోత్సాహకాలు లేకుండా 15 శాతం ఆదాయపు పన్ను చెల్లించవచ్చని నిర్మల సీతారామన్ అన్నారు. ఈ ప్రకటనతో కొత్త సంస్థలకు అన్ని సర్చార్జ్ మరియు సెస్లతో కలిపి పన్ను రేటు 17.01 శాతంగా ఉంటుంది. ఆర్ధిక వ్యవస్థలో జోరు పెంచేందుకు, ఉత్పత్తుల రంగంలో పెట్టుబడులు పెంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్ధిక మంత్రి కార్పొరేట్ టాక్స్ తగ్గింపు ప్రకటనతో, స్టాక్ మార్కెట్ జోరు అందుకుని భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1600 పాయింట్ల లాభంతో 37,750 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. మరో వైపు నిఫ్టీ 509 పాయింట్ల లాభంతో 11,214 పాయింట్లతో ట్రేడ్ అవుతుంది. గత కొన్ని రోజులుగా మందకొడిగా సాగుతున్న మార్కెట్లు, ఈ నిర్ణయం వలన ఉపందుకుని అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి.
[subscribe]