నరేంద్రమోదీ నాయకత్వం లో బిజెపి పార్టీ రెండోసారి ఘన విజయం సాధించింది, ఇప్పుడు దేశ ప్రజలంతా ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ ఎన్నికల హామీల నేపధ్యంలో బడ్జెట్ పై ఎటువంటి కసరత్తు చేసారు, ప్రజలకు ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారనే అంశాలపై చర్చించుకుంటున్నారు. ఈ సారి మోడీ ప్రభుత్వం సంక్షేమం పై దృష్టి సారించనున్నారు, పన్ను వసూళ్లు, జిఎస్టీ ఇతర విషయాలు పరిగణలోకి తీసుకొని, ప్రజల కిచ్చిన హామీల నేపథ్యంలో తాజా బడ్జెట్ ఉంటుందని ఆర్ధిక మంత్రి స్పష్టం చేసారు.
గత బడ్జెట్ లో పన్ను వసూలు కి పెట్టుకున్న అంచనాలను ప్రభుత్వం చేరుకోలేక పోయింది, ఆ లోటుని ఆర్బీఐ సహకారంతో దాటాలని ప్రభుత్వం యోచిస్తుంది. వృద్ధిరేటు, వడ్డీ రేట్లపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యవసాయ రంగం పై కేటాయింపులు, బ్యాంకింగ్ సంస్కరణలు కు పెద్ద పీట వెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. 2019- 20 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ లో పన్ను స్లాబు, గృహ రుణాలు, చిన్న సన్నకారు రంగాలకు ప్రోత్సహం, మహిళా భద్రత, ఇతర అనేక అంశాలపై ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దివంగత మాజీ మహిళా ప్రధాని ఇందిరా గాంధీ తరువాత, ఒక పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టే మహిళగా నిర్మల సీతారామన్ రికార్డ్ సాధించనున్నారు.