జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు మరియు రాష్ట్ర పునర్విభజన తర్వాత, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోవాల్ శ్రీనగర్ ప్రాంతంలో పర్యటించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. ఆగష్టు 5 తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత అజిత్ ఢోవాల్ 11 రోజుల కశ్మీర్ లోయలో పర్యటించారు. కొంత సమయం తరువాత మరోసారి ఆయన బుధవారం నాడు శ్రీనగర్ చేరుకున్నారు. ఈ పర్యటనలో కశ్మీర్ లో పరిస్థితులను మరోసారి సమీక్షించి, ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు సజావుగా అమలు అయ్యేలా భవిష్యత్ కార్యాచరణను నిర్ణహించబోతున్నట్టు అధికార వర్గాలు తెలియజేశాయి.
జమ్మూ కశ్మీర్ పునర్విభజనకు ఇప్పటికే ఉభయ సభల్లో మరియు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలుపగా, అక్టోబర్ 31వ తేదీ నుంచి జమ్మూ కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి భద్రతా అధికారాలతో అజిత్ ఢోవాల్ సమావేశం కానున్నారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా, ప్రశాంత వాతావరణం ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. ఈ నెల 27 న జరగబోయే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కాశ్మీర్ సమస్యను పాకిస్తాన్ లేవనెత్తనున్న తరుణంలో, సంబంధిత పరిణామాలను ఎదుర్కోవటానికి పరిపాలన విభాగాన్ని సిద్ధంచేసే వ్యవహారంలో భాగంగా ఈ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది.
[subscribe]