అయోధ్య ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ కి సంబంధించిన కేసులో ఇప్పటికే వాదనలు పూర్తయి, తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. మరి కొద్దీ రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అయోధ్య అంశంపై ఎటువంటి అనవసర ప్రకటనలు కానీ వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సభ్యులను కోరారు. నవంబర్ 6, బుధవారం నాడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అయోధ్య తీర్పు అంశం, ఏర్పడే పరిస్థితులపై చర్చించారు. ప్రభుత్వంలో ఉన్నవారితో సహా ప్రతి ఒక్కరికి దేశంలో శాంతి, సామరస్యతను కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. కోర్టు వెలువరించే తీర్పు ఏదైనా గెలుపు, ఓటమి లాగా భావించవద్దని కోరారు.
అయోధ్య కేసులో సుప్రీం కోర్టు త్వరలో తీర్పు చెప్పనున్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో అక్టోబర్ 13 నుంచే సెక్షన్ 144ని విధించారు. డిసెంబర్ 10 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా మేజిస్ట్రేట్ తెలియజేసారు. అదేవిధంగా సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచడానికి 16 వేల మంది వాలంటీర్లను నియమిస్తున్నట్టు సమాచారం. సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నవంబర్ 17వ తేదీన పదవి విరమణ చేయబోతుండంతో ఆ లోపే తుది తీర్పు వెలువడవచ్చని భావిస్తున్నారు.
[subscribe]