భారత్ లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 11, 12 తేదీల్లో తమిళనాడు లోని కాంచీపురం జిల్లా మహాబలిపురంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జిన్పింగ్ లు సమావేశం కానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జిన్పింగ్ పూర్తిగా తమిళనాడు రాష్ట్రంలోనే గడపనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి, జిన్పింగ్ పర్యాటక ప్రాంతమైన మహాబలిపురాన్ని సందర్శించనున్నారు. ఇరు దేశాధినేతల భేటీ కోసం మహాబలిపురంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక సమావేశాలు జరిగే ప్రాంతాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. మోదీ, జిన్పింగ్ చర్చలు జరిపే ప్రాంతం, మరియు విడిది ప్రాంతాలను కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాలు, ఇతర భద్రతా దళాలు ఇప్పటికే పలుమార్లు పరిశీలించాయి.
2018 ఏప్రిల్ 27, 28 తేదీలలో చైనాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ, జిన్పింగ్ తో పలు అంశాలపై మొదటిసారి చర్చించి, ఆయనను భారతదేశ పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో భారత పర్యటనకు వస్తున్న జిన్పింగ్ తో మరొకసారి వాణిజ్య సంబంధాలు, అంతర్జాతీయ సమస్యలు, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు, ఇతర కీలక అంశాలపై మోదీ చర్చించబోతున్నట్టు సమాచారం. ఇరు దేశాధినేతలు మహాబలిపురంలో సమావేశమవుతుండడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]