కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు మళ్ళి వేడెక్కాయి, జెడిఎస్- కాంగ్రెస్ లతో ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటూ సాగుతున్న తరుణంలో మళ్ళీ నేతల రాజీనామాలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సి), జనతాదళ్ సెక్యులర్ జెడి [ఎస్] పార్టీలకు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు జూలై 6 న రాజీనామాలను సమర్పించారు. పార్టీలలో సరైన స్థానం లభించడం లేదని,అంతర్గత వివాదాలు, సీనియర్ నాయకుల కలుపుకుపోవడం లేదని,అసంతృప్తి తో రాజానామాలు చేస్తునట్టు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. రాజీనామా చేసిన కొంతమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేత ని ముఖ్యమంత్రిగా చేస్తే, రాజీనామాలు ఉపసంహరించుకుంటాం అని ప్రకటనలు చేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి, అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని ఆదివారం రాత్రి బెంగుళూరు కు చేరుకున్నారు. హెచ్. డి దేవెగౌడ, జెడిఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నేతలు, అసంతృప్తి నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు, మంత్రి డి కే శివ కుమార్ రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి, పరిస్థితులు చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాంగ్రెస్ అధిష్టానంతో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర బిజెపి నేతలు, ఈ సంక్షోభంలో తమ ప్రమేయం ఏది లేదంటూనే, పార్టీ అగ్రనాయకత్వం సూచనలతో పావులు కదుపుతున్నారు, ఒకటి రెండు రోజుల్లో ఈ పరిణామాలన్నీ తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంది.