జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రెండోదశ పోలింగ్ కొనసాగుతోంది. రెండో విడతలో భాగంగా 20 అసెంబ్లీ స్థానాలలో డిసెంబర్ 7, శనివారం నాడు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ఉదయం 7 గంటలకు నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. అయితే జంషెడ్పూర్ (తూర్పు), జంషెడ్పూర్ (పశ్చిమ) లలో మాత్రం పోలింగ్ ఓటింగ్ 5:00 గంటలవరకు కొనసాగనుంది. ఈ దశలో సుమారు 47 లక్షల మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అలాగే 260 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శనివారం ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ బూత్ల వద్దకు చేరుకున్నారు. ఉదయం 11 గంటల సమయానికి 28.5 శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువా మరియు శాసనసభ స్పీకర్ దినేష్ ఓరాన్ ఈ విడతలో ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా, అయిదు దశల్లో ఎన్నికల జరగనున్నాయి. తోలి దశలో ఇప్పటికే 13 స్థానాల్లో ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 12న మూడో విడత , డిసెంబర్ 16న నాలుగో విడత, డిసెంబర్ 20న ఐదో విడత పోలింగ్ ను నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 23న వెల్లడిస్తారు.
[subscribe]