మహారాష్ట్రలో అక్టోబర్ 24న ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటివరకు ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన దస్త్రానికి నవంబర్ 12, మంగళవారం నాడు సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ, శివసేన పార్టీలకు అవకాశం కల్పించినప్పటికీ అవసరమైన మద్దతు కూడగట్టకపోవడం, చివరిగా ఆహ్వానించినా ఎన్సీపీ మరింత గడువు కోరడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ సిఫార్సు చేసారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో, రాజ్యాంగంలోని రాష్ట్రపతి పాలనగా పిలవబడే ఆర్టికల్ 356ని పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ నివేదికను సమర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశమయిన కేంద్ర కేబినెట్ గవర్నర్ నిర్ణయం మేరకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు ఆమోదం ముద్ర వేసింది. అనంతరం కేంద్ర కేబినెట్ తీర్మానం, గవర్నర్ నివేదికను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా, పంజాబ్ పర్యటన ముగించుకొని దిల్లీ చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆ నివేదికలను పరిశీలించి సంతకం పెట్టడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది.
[subscribe]