కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, అక్టోబర్ 10 గురువారం నాడు తనపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో సూరత్ లోని మేజిస్ట్రియల్ కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ… వీరందరికి మోదీ ఇంటిపేరు ఎలా వచ్చింది? దొంగలందరూ మోదీ ఇంటిపేరునే ఎందుకు పెట్టుకుంటారు ” అంటూ మోదీ అనే ఇంటిపేరును హైలైట్ చేయడం వలన, ఆయన వ్యాఖ్యల పట్ల సూరత్ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే పర్నేశ్ మోదీ, రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు దాఖలు చేసారు. ఈ కేసుపై చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బీహెచ్ కపాడియా విచారణ చేపట్టారు.
రాహుల్ గాంధీ వాంగ్మూలం ఇచ్చిన అనంతరం, ఈ కేసులో ఇకపై వ్యక్తిగత హాజరు నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాహుల్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాహుల్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడంపై మోదీ తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. రాహుల్ పిటిషన్ సమీక్షించిన కోర్టు తుది నిర్ణయాన్ని డిసెంబర్ 10 వరకు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. డిసెంబర్ 10 వరకు ఈ కేసులో రాహుల్ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేదని కోర్టు తెలిపింది. ఇదే కాకుండా బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆయన కుమారుడు జై షా పై ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో కూడ అక్టోబర్ 11 మధ్యాహ్నం 3 గంటలకు అహ్మదాబాద్ కోర్టులో రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంది.
[subscribe]