భారత్ వైమానిక దళంలోకి మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. అక్టోబర్ 8, మంగళవారం నాడు ఫ్రాన్స్లో తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వీకరించారు. దసరా పండగతో పాటు, 87వ ఎయిర్ఫోర్స్ డే జరుపుకుంటున్న శుభసందర్భంలో తోలి రఫేల్ విమానాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఫ్రాన్స్లోని బోర్డియాక్స్లో డసోల్ట్ ఏవియేషన్ కర్మాగారంలో ఈ యుద్ధ విమానాన్ని మంత్రి స్వీకరించారు. రఫేల్ విమానాన్ని అందుకున్న అనంతరం ఆయన ఆయుధ పూజ నిర్వహించారు. రఫేల్ రాకతో వైమానిక దళం బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ తరహాలో 36 రఫేల్ యుద్ధ విమానాలు భారత్ కు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మూడు రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. రఫేల్ యుద్ధ విమానం స్వీకరించిన అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్తో భేటీ అయ్యారు. భారత్, ఫ్రాన్స్ బంధానికి రఫేల్ విమానాల అప్పగింత సరికొత్త అధ్యాయమని తెలిపారు. రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాలమధ్య భవిష్యత్ లో పలు రంగాల్లో పరస్పర సహకార విధానం మరింతగా బలపడుతుందని చెప్పారు. అనుకున్న సమయానికే రఫేల్ యుద్ధవిమానాలు అందజేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక సంబంధాలపై చర్చించారని, ఈ భేటీ భారత్, ఫ్రాన్స్ లాంటి బలమైన దేశాలమధ్య ద్వైపాక్షిక బంధాన్ని చాటి చెప్పిందని రక్షణశాఖ ప్రకటించింది.
[subscribe]