భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) సవరణ బిల్లు 2019 (యుఏపీఏ) ఆగస్టు 2వ తేదీన రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. సభలో సవరణ బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు రాగా,42 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. ప్రతిపక్ష పార్టీలు సవరణ బిల్లును పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపమని డిమాండ్ చేయడంతో, ఈ ప్రతిపాదనపై ఓటింగ్ నిర్వహించడంతో అనుకూలంగా 84 మంది ఓటు వేయగా, 104 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. జూలై 24న బిజెపి ప్రభుత్వం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది.
ఈ బిల్లు ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది మరియు ఉగ్రవాద కలాపాలపై ఎన్ఐఏ ఏ రాష్ట్రంలో అయిన, ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారాన్ని ఈ బిల్లు కలగజేస్తుంది. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ యుఏపీఏ బిల్లును ప్రవేశపెట్టడానికి ఏకైక కారణం ఉగ్రవాదంపై పోరాడటమేనని అన్నారు.ఉగ్రవాదిని వ్యక్తిగతంగా గుర్తించే పరిశీలన నాలుగు దశల్లో ఉంటుందని రాజకీయ సమస్యలను పక్కన పెట్టి జాతీయ భద్రతకు ఐక్యతగా ఆలోచించాలని ఆయన ప్రతిపక్ష పార్టీలను కోరారు. కాంగ్రెస్,డిఎంకె మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నాయి, వైసీపీ పార్టీ బిల్లుకు మద్ధతు తెలిపింది. బీజేపీ ప్రభుత్వం వరుసగా సమాచార హక్కు (సవరణ) బిల్లు-2019, ట్రిపుల్ తలాక్ బిల్లు-2019, యుఏపీఏ బిల్లు-2019 ను రాజ్యసభలో ఆమోదింపజేసుకుంది.
[subscribe]
[youtube_video videoid=JeT1qcC9EPs]