మహారాష్ట్రలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం కోసం బీజేపీ, శివసేన పార్టీల మధ్య నెలకున్న విబేధాలు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కావాలంటే సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పార్టీ పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 6, బుధవారం నాడు పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిస్థితులపై వారిద్దరూ చర్చించారు. అయితే భేటీ అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ, శివసేన పార్టీతో ఎన్సీపీ పార్టీ కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజలిచ్చిన తీర్పును అనుసరించి కాంగ్రెస్తో కలిసి విపక్షంలోనే కూర్చుంటామన్నారు. బీజేపీ, శివసేన పార్టీలు వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. బీజేపీతో కలవకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో, శివసేనకు సంఖ్యాబలం ఎక్కడుందని శరద్ పవార్ ప్రశ్నించారు.
మరో వైపు శివసేనను ఒప్పించేందుకు బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని రంగంలోకి దింపింది. శివసేనతో చర్చలు జరిపేందుకు గడ్కరీ బుధవారం నాడు ముంబయి చేరుకోనున్నారు. ఇప్పటికే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్తో నాగ్పూర్లో భేటీ అయ్యి శివసేన డిమాండ్లు, బీజేపీ ఆలోచనలను ఆయనకు వివరించారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్పటేల్ ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వారిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రైతులు సమస్యలపైనే తాను గడ్కరీని కలిశాననీ, రాజకీయ అంశాలేవీ చర్చించలేదని ఆయన స్పష్టం చేసారు. ఇలా ప్రముఖ నాయకుల మధ్య వరుస భేటీలు జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే మహారాష్టలో ఎవరూ ముఖ్యమంత్రి అవుతారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
[subscribe]