భారత మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని శక్తిస్థల్ వద్ద పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉప రాష్ట్రపతి అమీద్ అన్సారీ తదితరులు మంగళవారం నాడు ఢిల్లీలోని ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్ వద్ద నివాళులు అర్పించారు. ‘భారతదేశాన్ని దృఢమైన దేశంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన ఐరన్ లేడీ, మా నానమ్మ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నానని’ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అలాగే ఇందిరాగాంధీ సంకల్పం దేశాన్ని గొప్ప ఎత్తులకు తీసుకెళ్లిందని, భారతదేశ జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థ మరియు విదేశాంగ విధానానికి ఆమె చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తించుకునేలా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధికార ఖాతా నుంచి ట్వీట్ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. భారతదేశపు మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరియు కమలా నెహ్రూ దంపతులకు నవంబర్ 19, 1917న ఇందిరాగాంధీ జన్మించారు. భారతదేశానికి ప్రధానిగా పనిచేసిన ఒకే ఒక మహిళా ఇందిరాగాంధీ. ఆమె రెండు సార్లు దేశానికి ప్రధానిగా సేవలు చేశారు. ఇందిరా గాంధీ అక్టోబర్ 31, 1984లో ప్రధానిగా ఉన్న సమయంలోనే తనకు భద్రతగా ఉన్న సిబ్బంది జరిపిన దాడిలోనే ఆమె మరణించారు. ఈ రోజు ఆమె జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు నాయకులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
[subscribe]