భారత మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరా గాంధీ వర్థంతిని పురస్కరించుకొని శక్తిస్థల్ వద్ద పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, అమీద్ అన్సారీ తదితరులు గురువారం నాడు ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ, ఇందిరా గాంధీ గొప్ప ధైర్యవంతురాలని కొనియాడారు. ఆమె దేశానికి చేసిన సేవలు గుర్తు చేసుకోవాలని చెప్పారు. ‘మా నాన్నమ్మ, భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీకి నా నివాళులు’ అంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేసారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇందిరాగాంధీకి నివాళులు అర్పించారు. భారతదేశానికి ప్రధానిగా పనిచేసిన ఒకే ఒక మహిళా ఇందిరాగాంధీ. ఆమె రెండు సార్లు దేశానికి ప్రధానిగా సేవలు చేశారు. ఇందిరా గాంధీ అక్టోబర్ 31, 1984లో ప్రధానిగా ఉన్న సమయంలోనే తనకు భద్రతగా ఉన్న సిబ్బంది జరిపిన దాడిలోనే ఆమె మరణించారు. ఆమె వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు నాయకులు నివాళులు అర్పిస్తున్నారు.
[subscribe]