గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ( సీఈవో) సుందర్ పిచాయ్ మరో కీలక బాధ్యతను కూడా తీసుకోబోతున్నారు. ఇకపై గూగుల్ యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్కి కూడా సీఈవోగా ఆయనే వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు ఆల్ఫాబెట్ కు సీఈవోగా లారీ పేజ్, అధ్యక్షుడిగా సెర్గి బ్రిన్ బాధ్యతలు నిర్వహించారు. వారిద్దరూ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో భాగంగా ఉంటూ సంస్థలో కీలక పాత్ర పోషిస్తామని, కీలక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని లారీ పేజ్, సెర్గి బ్రిన్ తెలిపారు. ఈ మేరకు వారిద్దరూ బ్లాగ్లో పోస్ట్ చేశారు.
గూగుల్ యొక్క ఇతర అనుబంధ సంస్థల పనితీరు మెరుగ్గా ఉందని, కంపెనీని ఇంకా సమర్థంగా నడిపించేవారున్నపుడు నాయకత్వ బాధ్యతలు నిర్వహించడం సరైన నిర్ణయం కాదని భావిస్తున్నట్టు వారు తెలిపారు. ఆల్ఫాబెట్కి, గూగుల్కి ఇద్దరు వేర్వేరు సీఈవోలు ఉండాల్సిన అవసరం లేదని, ఆల్ఫాబెట్ ను నడిపించే సామర్థ్యం సుందర్ పిచాయ్ కు ఉందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, వెబ్ సెర్చింగ్, తదితర టాస్క్లకు సంబంధించిన టెక్నాలజీలను సుందర్ పిచాయ్ ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం ఉందని తెలిపారు. ఆల్ఫాబెట్ బాధ్యతల అప్పగింతపై సుందర్ పిచాయ్ స్పందిస్తూ, నాయకత్వ బదిలీతో సంస్థ పనితీరులో, నిర్మాణ వ్యవహారాలలో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. అల్ఫాబెట్ బాధ్యతలను స్వీకరించడం ఆసక్తి కలిగిస్తోందన్నారు.