కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు రివ్యూ పిటిషన్లపై నవంబర్ 14, గురువారం నాడు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం శబరిమల కేసుపై విచారణ చేపట్టనుంది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఖన్విల్కర్ లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ కేసులో గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ తీర్పును పునఃసమీక్షించాలని దాఖలైన పలు పిటిషన్లను పెండింగ్లో ఉంచుతూ, పలు మతపరమైన అంశాలు ముడిపడినందువలన తదుపరి విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యతిరేకించారు, గతంలో ఇచ్చిన తీర్పునే కొనసాగించాలని వారు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో 3:2తో మెజారిటీ జడ్జీల నిర్ణయం మేరకు విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శబరిమల కేసుపై తన తీర్పు ప్రతిని చదువుతూ, ‘మతంలోని అంతర్గత అంశాలు, మత విశ్వాసాలుపై చర్చ జరపాలని పిటిషనర్లు కోరారు. ప్రతీ ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంది. ప్రార్థన చేసుకునే హక్కుకు లింగభేదం లేదు. అన్ని ప్రార్థనా మందిరాల్లో మహిళల ప్రవేశంతో ఈ అంశం ముడిపడి ఉందన్నారు. ఒక్క శబరిమల ఆలయానికే కాకుండా, మసీదులో ముస్లిం మహిళలు, బోరాలో పార్శీ మహిళల ప్రవేశ అంశం కూడ తెరపైకి వస్తుందని’ చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. మత విశ్వాసం పౌరుల హక్కు అని, మతంలోకి చొచ్చుకొనే అధికారం కోర్టులకు ఉందా? అనే అంశం చర్చకు వచ్చిందని తెలిపారు. ఈ కేసులో దాఖలైన 65 పెండింగ్ పిటిషన్లను విస్తృత ధర్మాసనం విచారిస్తుందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు.
[subscribe]