ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం బెయిల్ పిటిషన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కు సుప్రీంకోర్టు నవంబర్ 20, బుధవారం నాడు నోటీసు జారీ చేసింది. చిదంబరం బెయిల్ పిటిషన్ పై సోమవారం నాటికీ సమాధానం దాఖలు చేయాలని కోరుతూ, తదుపరి విచారణను నవంబరు 26కు వాయిదా వేసింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను నవంబర్ 15 న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అంతేగాక ఆయన జ్యుడిషియల్ రిమాండ్ ను నవంబర్ 27 వరకు పొడిగించింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు స్వీకరించగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపి ఈడీకి నోటీసులు జారీ చేసింది. చిదంబరాన్ని ఆగస్టు 21 న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసి విచారణ అనంతరం రిమాండ్ మీద తీహార్ జైలుకి తరలించారు. ఈ కేసులో అక్టోబర్ 22 న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అక్టోబర్ 16న మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో బెయిల్ లభించినప్పటికీ జుడిషియల్ కస్టడీ ముగిసేవరకు ఆయన తీహార్ జైలులోనే ఉండాల్సి ఉంది.
[subscribe]