కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి కారణమైన అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలపై, సుప్రీం కోర్టు బుధవారం ఉదయం 11 గంటకు తీర్పు వెలువరించనుంది. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు మరియు స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్ లపై సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది, ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత తీర్పుని రేపటికి రిజర్వు చేసింది. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల తరుపున ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ తరుపున మరో న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తమ వాదనలు వినిపించారు. స్పీకర్ కావాలనే రాజీనామాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నాడని ముకుల్ రోహత్గి వాదించగా, సభ్యులు సరైన పద్ధతిలో రాజీనామాలు సమర్పించలేదని, అనర్హత అంశం కూడ స్పీకర్ పరిశీలిస్తున్నాడని అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు తెలియజేసారు.
తొలుత వాదనలు విన్న కోర్టు, స్పీకర్ యధాతథ స్థితి కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది, మరల పరిస్థితుల దృష్ట్యా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పుని రేపటికి వాయిదా వేసింది. సుప్రీం కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందోనని పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు గురువారం నాడు బలపరీక్ష కు సిద్ధపడ్డ కుమారస్వామి, ఎట్టి పరిస్థితులలో అయిన మెజారిటీ నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జెడిఎస్- కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని పేర్కొన్నారు. రేపు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో పదిరోజులుగా కొనసాగుతున్న కర్ణాటక రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరుకునే అవకాశం ఉంది.
[subscribe]
[youtube_video videoid=QXjZ8zhYj4s]