భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్ను మూసారు. ఆగస్టు 6 మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తీవ్ర అస్వస్థత కు గురవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు, అక్కడ చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. సుష్మా స్వరాజ్ 1952, ఫిబ్రవరి 14న జన్మించారు, ఆమె వయస్సు 67 సంవత్సరాలు. సుష్మా స్వరాజ్ ను ఎయిమ్స్ కు తరలించగానే పలువురు కేంద్రమంత్రులు హుటా హుటిన అక్కడకు చేరుకున్నారు. ఆమె మృతి కి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా మరియు ఇతర కేంద్రమంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. దేశానికి, పార్టీకి ఆమె చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు.
సుష్మా స్వరాజ్ విద్యార్థిగా ఉన్నప్పుడే 1970 లో రాజకీయాల్లోకి వచ్చారు. 1977 హరియాణాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, భారతదేశంలో 25 సంవత్సరాల వయసులోనే రాష్ట్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలుగా తీసుకుని రికార్డ్ సృష్టించారు. సుష్మా స్వరాజ్ సుప్రీం కోర్టులో న్యాయవాదిగా కూడ పనిచేసారు. ఆమె 7సార్లు పార్లమెంటు సభ్యురాలిగా, 3సార్లు శాసనసభ సభ్యురాలిగా పనిచేసారు. 1998 అక్టోబర్ లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1996లో అటల్ బిహారి వాజపేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసారు. లోక్ సభలో జరుగుతున్న చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనీ అప్పట్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
2009 లోక్ సభలో ప్రతిపక్ష పార్టీనేతగా బాధ్యతలు చేపట్టి గుర్తింపు పొందారు. 2014 నుంచి 2019 వరకు నరేంద్రమోడీ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసారు, ఈ కాలంలో ఎంతో మందికి సహాయం చేసి పేరు ప్రఖ్యాతలు పొందారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ విదేశాలలో అనేక కారణాల వలన ఇబ్బంది పడుతున్న వారికీ ఎంతో సహాయం చేసేవారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తరువాత విదేశీ వ్యవహారాల మంత్రిగా అత్యంత కీలకంగా పని చేసి గుర్తింపు పొందారు. తెలంగాణ బిల్లు పాస్ అవ్వడంతో కీలక పాత్ర పోషించి ఈ ‘చిన్నమ్మ’ ను గుర్తుంచుకోవాలని కోరారు. అనారోగ్య కారణాల దృష్ట్యా 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సుష్మా స్వరాజ్ పోటీ చేయలేదు. ఆమె మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు నాయకులు, ప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం సుష్మా స్వరాజ్ పార్థివదేహాన్ని 12 గంటల నుండి 3 గంటల వరకు బీజేపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో ఉంచనున్నారు, ఆ తరువాత లోధీ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతోఅంత్యక్రియలు నిర్వహించనున్నారు.
[subscribe]
[youtube_video videoid=Y7tKqGsKIeA]