పుల్వామా దాడి అనంతరం, భారత్ పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్స్ లో భాగంగా పరాయి దేశంలో శత్రువులు చేతికి చిక్కినా కూడ అత్యంత ధైర్య సాహసాలు చూపించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రభుత్వం అభినందన్ వర్థమాన్ ను ‘వీర్ చక్ర’ పురస్కారానికి ఎంపిక చేసింది. అతని ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఐఏఎఫ్ వీర్ చక్ర అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 15న ఈ అవార్డు అందజేయనున్నారు. ఆయనతో పాటు పలువురు జవాన్లకు శౌర్య చక్ర, కీర్తి చక్ర అవార్డులు అందజేస్తారు.
ఫిబ్రవరి 26, 2019 బాలాకోట్ లో భారత్ పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం, పాకిస్తాన్ విమానాలు భారత్ పై దాడికి ప్రయత్నం చేసాయి. అటువంటి సమయంలో అభినందన్ వర్థమాన్ తన మిగ్ జెట్ విమానంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసాడు, తర్వాత మిగ్ విమానం కూడ కూలిపోవడంతో అభినందన్ వర్థమాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో దిగాడు. అక్కడి స్థానికులు పట్టుకుని పాకిస్తాన్ సైన్యానికి అప్పగించారు, అంతర్జాతీయ దేశాల నుండి పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరగడంతో మూడు రోజుల తరువాత పాకిస్తాన్ అధికారికంగా సరిహద్దు వద్ద భారత్ కు అప్పగించింది. ఎటువంటి సైనిక రహస్యాలు వెల్లడించకుండా చూపిన తెగువకు అభినందన్ ను దేశ ప్రజలు ఎంతో మెచ్చుకున్నారు. జవాన్లకు ఇచ్చే పరమ వీర చక్ర, మహా వీరచక్ర తరువాత ఇచ్చే మూడో అత్యున్నత వీర్ చక్ర పురస్కారాన్ని అభినందన్ అందుకోనున్నారు.
[subscribe]
[youtube_video videoid=3tZ3f3uIJ7M]