కర్ణాటకలో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఎట్టకేలకు తెరపడింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కర్ణాటక రాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేసారు. కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాళా, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి నాలుగోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రి యడియూరప్ప జూలై 29 న బలపరీక్ష నిర్వహించి, కేబినెట్ ను ఏర్పాటు చేయనున్నారు.
జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి రాజీనామా తరువాత,కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప రెండు రోజుల పాటు బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలని జూలై 26న గవర్నర్ను అభ్యర్థించారు, ఆ వెంటనే సాయంత్రం ప్రమాణం చేస్తానని ప్రకటించారు. యడియూరప్ప ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నా కూడ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఎవరూ హాజరు కాలేదు.
శాసన సభలో విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు గవర్నర్ వారం రోజుల పాటు సమయం ఇచ్చినప్పటికీ, సోమవారం, జూలై 29 న బల పరీక్షకు యడియూరప్ప సిద్ధమయ్యారు. అయితే బల పరీక్షలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల మద్దతును నమ్ముకున్న బీజేపీ పార్టీ, వారిపై అనర్హత వేటు వేస్తాడేమో అని అనుమానంతో ప్రస్తుత స్పీకర్ రమేష్ కుమార్ పై వేటు వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం స్పీకర్ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడియూరప్ప బలపరీక్షలో నిరూపించుకునేంతవరకు కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయో అని పరిశీలకులు భావిస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=aFEQSAukDD4]