కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందింది. దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు 5% డియర్నెస్ అలవెన్స్(డీఏ) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవడేకర్ అక్టోబర్ 9, బుధవారం నాడు ప్రకటించారు. ఈ నిర్ణయం వలన సుమారుగా 50 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు, మరో 62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లిస్తున్న కరవు భత్యం 12 శాతం నుంచి ఒక్కసారిగా 17 శాతానికి పెరిగింది.
డీఏ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ప్రతి సంవత్సరం ఖజానాపై 16 వేల కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్రమంత్రి వెల్లడించారు. అంతే కాకుండా ఆశా వర్కర్లకు కేంద్రం అందించే భత్యాన్ని కూడ రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రూ.1000 ఉండగా కేంద్రం నిర్ణయంతో రూ.2000 కు చేరనుంది. మరో వైపు కిసాన్ సమ్మాన్ కింద రైతులకు ఇచ్చే డబ్బు పంపిణీ కోసం ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియను నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ తెలిపారు.
[subscribe]