పెరుగుతున్న కాలుష్యం ఓ వైపు.. రసాయనాలతో నిండిన ఆహారపదార్ధాలు మరోవైపు మనిషిని రోజురోజుకు అనారోగ్యం పాలు చేస్తున్నాయి. ఒత్తిడులు, ఉరుకుల పరుగుల జీవితంలో తమ గురించి తాము ఆలోచించుకునే తీరిక లేకుండా గడిపేస్తున్నారు. దీంతో శరీరం రోగాల పుట్టగా మారిపోతుందన్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుంటున్నారు. అందుకే ఇప్పుడిప్పుడే తమ తప్పులు తెలుసుకుని.. పాతతరపు ఆహారపుటలవాట్లవైపు మొగ్గు చూపిస్తున్నారు నేటి తరం.
మన తాత ముత్తాతలు తమ పొలంలో పండే చిరుధాన్యాలైన రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు వంటి వాటిని ఆహారంగా తీసుకునే వారు. అప్పట్లో వాటిని ఆహారంగా తీసుకున్న వారంతా ఏకంగా 80నుండి 100 ఏళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించగలిగారు. ప్రస్తుతం ఆ ధాన్యాలను తినేవారే కరువయ్యారు. చిరుధాన్యాల్లో అరికెలు చాలా ముఖ్యమైనవి. అధిక పోషక విలువలు కలిగి ఉండటం వల్ల ఇది చాలా మంచి ఆహారంగా చెప్పవచ్చు.
అరికెలలో అధిక మొత్తంలో ఫైబర్, కాల్సియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, వంటివి పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి అవసరమైన పోషకాలను అందించటంలో అరికెలు కీలక పాత్ర పోషిస్తాయి. అధిక బరువుతో బాధపడుతున్న వారు త్వరగా బరువు తగ్గాలంటే అరికెలను ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటానికి దోహదపడతాయి. అరికెలతో అన్నం , ఉప్మా వంటివి చేసుకుని తినవచ్చు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. గుండెజబ్బులు వంటివి రాకుండా ఉండేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా నెలసరి సమస్యలతో బాధపడుతున్న మహిళలకు అరికెలను ఆహారంగా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉండే అరికలలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర , కొలెస్ట్రాల్ స్ధాయిలను అదుపులో ఉంచుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు వల్ల బాధపడుతున్న వారికి అరికెల ఆహారం తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాలతో బాధపడుతున్న వారికి రక్త శుద్ధి చేసి త్వరగా కోలుకునేలా చేస్తుంది.