వరుసగా నాలుగో సంవత్సరం కూడా అగ్రరాజ్యం అమెరికా ఇండియన్ స్టూడెంట్స్కు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు మంజూరు చేసింది. ఎన్ని వీసాలు జారీ చేసిందన్నదానిపై కచ్చితమైన సంఖ్య తెలియకపోయినా, 2023 లో సుమారు 1.4 లక్షలకు పైగా వీసాలు జారీ చేసి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలోని మరే ఇతర దేశానికి కూడా అగ్రరాజ్యం ఇన్ని స్టూడెంట్ వీసాలు మంజూరు చేయలేదని తెలుస్తోంది. దీనిపై భారత్ లో అమెరికా దౌత్య కార్యాలయ వర్గాలు కూడా స్పందించాయి. ఈ సమ్మర్లో రికార్డు స్థాయిలో వీసా దరఖాస్తులను పరిశీలించామని, ఆ దరఖాస్తుదారులంతా కూడా తొలిసారిగా అమెరికా వెళుతున్నవారేనని వెల్లడించాయి.
కాగా, భారతీయ విద్యార్థుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉండటంతో..అగ్రరాజ్యం అమెరికా కొత్తగా 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అపాయింట్మెంట్ స్లాట్లను రిలీజ్ చేయడం వల్ల… భారతీయ దరఖాస్తుదారులు తగిన వ్యవధిలో ఇంటర్వ్యూలు పూర్తి చేయడానికి వీలు కలుగుతుందని అమెరికా ఎంబసీ వివరించింది.
మరోవైపు అమెరికా వెళ్లాలంటే వీసా దొరకడానికి నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలాసార్లు ఈ సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం కూడా వెల్లడించింది.అయితే మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనుండటం, తాజాగా పీఎం నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించిన తర్వాత.. వైట్హౌస్ ఈ నిర్ణయం తీసుకోవడం ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది.